ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి
Editor Desk
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, తాలు–తరుగుడు పేరుతో రైతులను దోపిడీ చేయవద్దని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
సిరిపురం గ్రామంలో సిపిఎం నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలు, ఎండల తీవ్రతతో రైతాంగం మరింత నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని చెప్పారు.
వడ్లు పట్టేందుకు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టిన రైతులకు తాలు పేరుతో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, అంబటి మల్లారెడ్డి, కూనూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, అంబటి సురేందర్ రెడ్డి, బైరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి