ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న వైనం..
ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న వైనం..
NM Yadav
ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాలలో అక్రమాలు..
ట్రక్ షీట్లలో వివరాలు నమోదు చేయకపోవడంపై చిరుమర్తి లింగయ్య ధ్వజం..
నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు పరాకాష్టకు చేరాయని అధికార పార్టీ నాయకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువునా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన నకిరేకల్లోని మహీంద్ర ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించి అక్కడ లారీల్లో ఉన్న ధాన్యం బస్తాలను, ట్రక్ షీట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, లారీ డ్రైవర్ల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగయ్య మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వెంటనే ట్రక్ షీట్లో రైతు పేరు, బస్తాల సంఖ్య, పరిమాణం నమోదు చేయాల్సి ఉండగా నిర్వాహకులు కావాలనే ఆ కాలమ్స్ను ఖాళీగా వదిలేస్తున్నారని మండిపడ్డారు. ట్రక్ షీట్కు ఒక తెల్ల కాగితాన్ని జోడించి, మిల్లు వద్దకు వెళ్లాక తరుగు పేరుతో బస్తాకు ఒకటి నుంచి రెండు కిలోల వరకు కోత విధిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇలా ఒక్కో లారీకి సుమారు 9 నుంచి 10 క్వింటాళ్ల ధాన్యాన్ని అక్రమంగా కాజేస్తున్నారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోల తూకం వేయాల్సి ఉండగా, కేంద్రాల్లో 42 కిలోలు వేయిస్తూ.. రైతు లెక్కలో మాత్రం 40 కిలోలనే చూపిస్తూ మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్కు ఫిర్యాదు..
ధాన్యం సేకరణలో జరుగుతున్న ఈ దోపిడీపై చిరుమర్తి లింగయ్య వెంటనే జిల్లా కలెక్టర్ మరియు పీడీ (PD) కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం నుంచి పూర్తి డబ్బులు చెల్లించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, పెండెం సదానందం, కడపర్తి మాజీ సర్పంచ్ గొర్ల వీరు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి