చీపురుగూడెం పాఠశాలకు నూతన ఊపు – కంప్యూటర్ అందజేత, ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
చీపురుగూడెం పాఠశాలకు నూతన ఊపు – కంప్యూటర్ అందజేత, ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు మరింత వేగం అందుకున్నాయి. ఇప్పటికే సుమారు రూ.65 వేల విలువైన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ను రోటరీ క్లబ్ ద్వారా అందజేయించడంలో కీలక పాత్ర పోషించిన సి.గుడిపాడు పాఠశాల ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డికి ఈసారి కంప్యూటర్ అందజేత కార్యక్రమంలో ఘన సన్మానం జరగడం విశేషంగా నిలిచింది.
పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందుతాయని, భవిష్యత్తులో వారు పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించగలరని అన్నారు. సేవా దృక్పథంతో ముందుకొచ్చే ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ డి. సుందరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యా రంగంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తెనపల్లి రాము, బి.సిహెచ్. రాంబాబు, ఏ. చెన్నారావు, గంటా షాకీనా తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థులు, గ్రామస్తులతో కిటకిటలాడగా, కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి