చాయ్వాలా పాలనలో గ్యాస్ సంక్షోభం… హోటళ్లకు మూతలు: సీపీఐ(ఎంఎల్) డి హరినాథ్ విమర్శలు
చాయ్వాలా పాలనలో గ్యాస్ సంక్షోభం… హోటళ్లకు మూతలు: సీపీఐ(ఎంఎల్) డి హరినాథ్ విమర్శలు
GADDAM JAGANMOHAN REDDY
చాయ్ అమ్మే వ్యక్తి దేశ ప్రధానిగా ఎదిగాడని ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు గోబెల్స్ తరహా ప్రచారం చేసుకున్నప్పటికీ నేడు దేశ ప్రజలు తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం తటస్థంగా వ్యవహరించడం వల్లే దేశంలో గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రరూపం దాల్చాయని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో రూ.2500 నుండి రూ.3000 వరకు అమ్ముతున్నారని, దళారుల మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు గత్యంతరం లేక కట్టెల పొయ్యిలను ఆశ్రయించే పరిస్థితి బాబు–మోడీ పాలనలో ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూసివేస్తున్నట్లు బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యుద్ధ పరిస్థితులు మనకు ప్రభావం లేదనే వాదనను మానుకొని ప్రజలకు అవసరమైన గ్యాస్, ఆయిల్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై భారీ ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు. గ్యాస్ ప్లాంట్ల వద్ద భద్రత పెంచాలని ప్రభుత్వాలు ఆదేశించే స్థితికి పరిస్థితి దిగజారిందన్నారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో బెంగళూరు, పూణే, చెన్నై నగరాల్లో ఎల్పీజీ కొరత కారణంగా కుకింగ్ కౌంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. కరోనా కాలంలో లాగానే యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా వంట కోసం విద్యుత్ పరికరాలు, బయో ఇంధనాన్ని వినియోగించుకోవాలని సూచనలు చేస్తున్నారని చెప్పారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు 45 రోజుల బుకింగ్ గడువు విధించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత సిలిండర్ వాగ్దానాలు నేడు వాగాడంబరాలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఈ గ్యాస్ సంక్షోభం ఇలాగే కొనసాగితే ప్రజలు ఎన్డీఏ పాలకులను నిలదీసే పరిస్థితి వస్తుందని డి.హరినాథ్ హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి