చెరుకుపల్లిలో అక్రమ మట్టి దందాను అడ్డుకున్న గ్రామస్తులు..
చెరుకుపల్లిలో అక్రమ మట్టి దందాను అడ్డుకున్న గ్రామస్తులు..
NM Yadav
మత్స్యకారుల ఉపాధికి గండి కొడుతున్నారంటూ ఆందోళన..
జేసీబీలు, టిప్పర్ల నిలిపివేత.. అధికారుల స్పందనకు డిమాండ్..
నకిరేకల్ : కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో సాగుతున్న అక్రమ మట్టి రవాణా మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ చెరువు నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న జేసీబీలు, టిప్పర్లను గ్రామస్తులు, మత్స్యకారులు ఏకమై అడ్డుకున్నారు. గత కొద్దిరోజులుగా వందలాది టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని, నల్లమట్టిని బొగ్గు బట్టీలకు మరియు ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలకు తరలిస్తుండటంతో సహనం కోల్పోయిన స్థానికులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా చెరువులో భారీ గుంతలు తీస్తూ మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపిస్తూ వాహనాలను నిలిపివేశారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ మట్టిని అడ్డగోలుగా తోడటం వల్ల చెరువులో చేపల పెంపకానికి ఆటంకం కలుగుతుందని ఇది తమ ఉపాధిపై దెబ్బకొడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా, చెరువులో ఏర్పడుతున్న భారీ గుంతల వల్ల ఈతకు వెళ్లే చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు మునిగిపోయే ప్రమాదం ఉందని మహిళలు, పెద్దలు ఆందోళన చెందారు. గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయని చెబుతున్న నిర్వాహకులు అసలు మైనింగ్ శాఖ నుండి ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే ఈ దందాను సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తుల తిరుగుబాటుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడున్న టిప్పర్లు, జేసీబీలు చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయాయి. మళ్లీ గ్రామంలోకి అక్రమ రవాణా కోసం అడుగుపెడితే సహించేది లేదని వాహనాలను ధ్వంసం చేస్తామని గ్రామస్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి అక్రమార్కులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంటు మహేందర్, మాజీ సర్పంచ్ బొస్కా ప్రసాద్, పోకల సైదులు, బొస్కా ఎల్లయ్య, పోకల మల్లయ్యతో పాటు మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి