చెప్పని కొత్త పథకాలను అమలు చేస్తున్న ఘనత మదే.. మంత్రి కోమటిరెడ్డి
చెప్పని కొత్త పథకాలను అమలు చేస్తున్న ఘనత మదే.. మంత్రి కోమటిరెడ్డి
NM Yadav
మే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తికావాలి..
అడగనివీ ఇస్తున్నాం అండగా నిలుస్తున్నాం..
విద్యార్థులకు ఉదయం రాగిజావ సాయంత్రం అల్పాహారం..
ఇందిరమ్మ జీవిత బీమా విప్లవాత్మకం మంత్రి కోమటిరెడ్డి..
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలనే కాకుండా, మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం అందించనుందని చెప్పారు. ఇకపై విద్యార్థులకు ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం వేళల్లో అల్పాహారాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందజేస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని.. అదే బాటలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏడాదికి రూ. 1400 కోట్లతో ఈ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లపై సీరియస్..
నల్లగొండ నియోజకవర్గంలో మంజూరైన 740 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్లన్నీ పూర్తి కావాలి. ఎవరైనా నిర్మించుకోవడం ఇష్టం లేకపోతే సోమవారం లోపు రాతపూర్వకంగా ఇవ్వాలి. వారి స్థానంలో కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తాం అని అధికారులను ఆదేశించారు. జూన్ నుంచి మరో విడత ఇళ్లు మంజూరు కానున్నాయని, ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయంతో ఇల్లు కట్టుకునే ఈ అవకాశాన్ని అర్హులు వినియోగించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, వెంటనే మిల్లులకు తరలించేలా ట్రాక్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
అభివృద్ధి బాటలో నల్లగొండ..
నల్లగొండ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రామగిరి టెంపుల్ నుండి దేవరకొండ రోడ్డు వరకు రూ. 15 కోట్లతో రహదారిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు న్యాక్ కేంద్రం ద్వారా మరిన్ని ఉపాధి కోర్సులను ప్రవేశపెడతామన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రభుత్వ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. మేయర్ బుర్రి చైతన్య, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి