బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్ఐ
బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్ఐ
Editor Desk
నల్గొండ టౌన్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు మారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు.
సోమవారం నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగిన డీవైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీలకు చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడినా ప్రభుత్వం, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
చట్టం అందరికీ సమానమైతే నిందితుడిపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగేలా వేగవంతమైన విచారణ చేపట్టాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున మాట్లాడే పాలకులు ఇలాంటి ఘటనల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.
బాధితులను భయపెట్టి నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా యువజనులు, ప్రజాసంఘాలు ఈ ఘటనపై స్పందించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా నాయకులు పోకల శశిధర్, అంజి, కార్తీక్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి