అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందాలి...భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందాలి...భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
NM Yadav
శాలిగౌరారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శాలిగౌరారం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలందరికీ చేరాల్సిన అవసరం ఉందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్లతో కలిసి మండలంలోని బైరవుని బండ గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా భైరవుని బండ నుండి నక్కలపల్లి వరకు రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రూ. 10 లక్షలతో చేపట్టనున్న గ్రామ సంఘ బంధ భవన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 10 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా చేపడుతున్న పనులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామని శాలిగౌరారం మండలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్కు సూచించారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతం చేశామని తెలిపారు. మండలంలోని ఇటుకలపాడు, జూలవారిగూడెం, శాలిగౌరారం నుండి వంగమర్తి వరకు పెండింగ్లో ఉన్న రహదారుల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా డొంక రోడ్లను డి.ఎం.ఎఫ్.టి నిధుల కింద మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు రూ. 500 బోనస్, ఉచిత విద్యుత్, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు వంటి నిర్ణయాలతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని రెండో విడతలోనూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.
ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాలను ప్రజలు వినియోగించుకోవాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు అందుబాటులో ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ శేఖర్ రెడ్డి, ఈ.ఈ గిరిధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి