అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
Editor Desk
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.
ఆలేరు,: అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజులు) కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హుల గుర్తింపు చేసి పథకాలు అందించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త సంక్షేమ పథకాలు కూడా అమలులోకి రానున్నాయని చెప్పారు.
సంక్షేమం పేదలకు చేరడమే లక్ష్యం: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ ఉచిత బస్సు, గృహజ్యోతి, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
100% లబ్ధిదారులకు పథకాలు చేరాలి: తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు శాతం 100 లబ్ధిదారులకు చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.
అవగాహన కార్యక్రమాలు కీలకం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో అవగాహన కార్యక్రమాలు కీలకమని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల అమలులో జిల్లా ముందుందని, మహిళల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి