ఇద్దరు నిందితుల అరెస్టు
రూ.1.50 లక్షలకు బంగారు చైన్ తాకట్టు
ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులు
వివరాలు వెల్లడించిన ఏసీపీ తిరుపతిరెడ్డి
తిరుమలాయపాలెం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను కూసుమంచి సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు. పిండిప్రోలు గ్రామంలో జూలై 17 అర్ధరాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ (26) చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మద్యపానం, ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. తన షాప్ సమీపంలో నివసించే వృద్ధ దంపతులను గమనిస్తూ.. వృద్ధురాలు సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించాడు. వాటిని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూలై 17 అర్ధరాత్రి వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆభరణాలు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు చైన్, నల్లపూసల చైన్కు సంబంధించిన బంగారు బిళ్లలను తీసుకుని పరారయ్యాడు.దొంగిలించిన బంగారు చైన్ను తన వరుసకు బామ్మర్ది అయిన మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం బాలినిధర్మారం గ్రామానికి చెందిన సరగండ్ల మహేష్ (20)కు ఇచ్చాడు. బ్యాంకులో తాకట్టు పెట్టి నగదు తీసుకురావాలని చెప్పాడు. మహేష్ ఖమ్మంలోని ఓ బ్యాంకులో తన పేరుతో చైన్ను తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల రుణం పొందినట్లు దర్యాప్తులో తేలింది. నాలుగు బృందాలతో దర్యాప్తు
కూసుమంచి సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కే. జగదీష్, పి. సంతోష్, జె. నాగరాజు, హరికృష్ణ, ఎస్ఐ దివ్య తదితరులు సమన్వయంతో దర్యాప్తు చేసి నిందితులను ఆదివారం ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో అరెస్టు చేశారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది పూర్ణచందర్రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనులను ఉన్నతాధికారులు అభినందించారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.













































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి