యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: మంత్రి సవిత
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: మంత్రి సవిత
Prakash
అమరావతి: యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు.
నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ హెచ్.హెచ్. డైక్మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని చెప్పారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని వెల్లడించారు. కేవలం 22 నెలల్లోనే రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమలు స్థాపించదలచిన వారికి తక్షణ అనుమతులు, అవసరమైన సహాయం అందిస్తామని పేర్కొన్నారు. డీపీఆర్లతో ముందుకు వచ్చే యువతకు సబ్సిడీ రుణాలు, మార్గదర్శకత కల్పిస్తామని తెలిపారు.
యువత ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మహిళలు ఈ రంగంలో రాణిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని మంత్రి సవిత అన్నారు.
ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ, అగ్ర కులాల్లోని పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం. విశ్వ, వీసీ గంగాధర్ రావు, కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, అధికారులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి