Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 02:55 PM

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు
February 22, 2026 06:50 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

వెబ్‌సైట్ సరళీకరణ – గడువు పొడిగింపు – అర్హులందరికీ కార్డులు

జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదనల మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడేషన్, వెబ్‌సైట్ సమస్యలు, కేబుల్ చానళ్లు, చిన్న పత్రికల ఇబ్బందులపై టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ నాయకుల బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ సారథ్యంలో కలిసి వినతి పత్రం సమర్పించింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామ్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ, జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చూస్తే సగం కార్డులు కూడా రాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. స్వతంత్ర, సీనియర్ జర్నలిస్టులకు విధించిన నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని, వెబ్‌సైట్‌లో అడిగే వివరాలు స్పష్టంగా లేవని, దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

జిల్లా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటులో గత సాంప్రదాయాన్ని కొనసాగించాలని యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసిన యూనియన్ నుంచి లేఖ అందితే కమిషనర్ కార్యాలయం ఆమోదించి సభ్యులను కమిటీలో చేర్చే విధానాన్ని పక్కన పెట్టి కలెక్టర్లకు పూర్తిస్థాయి అధికారం ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ అందరినీ నామినేట్ చేయాలనే నిబంధన సాధ్యంకాదని, ఇది కొత్త సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పెద్ద పత్రికలు, ఉపగ్రహ ప్రసార చానళ్లు, డెస్క్ జర్నలిస్టుల కార్డుల సంఖ్య తగ్గించే పరిస్థితి నెలకొనడంతో ఆందోళన ఉందని వివరించారు. చిన్న పత్రికలు, కేబుల్ చానళ్ల జర్నలిస్టులు కూడా గతంలా కార్డులు రాకపోవచ్చనే భయంతో ఉన్నారని తెలిపారు. ఈ అంశాలపై సుమారు ఇరవై నిమిషాల పాటు మంత్రితో చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడేషన్ వెబ్‌సైట్‌ను సరళీకరణ చేసి దరఖాస్తు విధానాన్ని సులభతరం చేస్తామని తెలిపారు. అక్రిడేషన్ల గడువును మరో నెల పాటు పొడిగించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో మాటేటి వేణుగోపాల్, వనం వెంకటేశ్వర్లు, మైస పాపారావు, మామిడాల భూపాల్, కనకం సైదులు, మోయినుద్దీన్, నాగండ్ల శివ, చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, వేగినాటి మాధవరావు, ఏలూరు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News