యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి
యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి
Biksham
అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్
తహసీల్దారుకు వినతి పత్రం
రైతులకు యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యూరియాను యాప్ విధానంలో అందించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు లేని రైతులు, సెల్ ఫోన్ లేని రైతులు కొత్త విధానంతో యూరియాను పొందలేకపోతున్నారని అన్నారు.ఎరువు దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు ముందుగా యాప్లో నమోదు చేసుకోవాలని చెప్పి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. కొందరు దుకాణ యజమానులు రైతుల పేర్లతోనే నమోదు చేసుకుని ఎరువును బ్లాకులో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. మండలానికి కేటాయించిన యూరియా ఇతర మండలాలకు మళ్లుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.అందువల్ల యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా రైతులకు సరిపడా అందించాలని, ఏ మండలానికి వచ్చిన యూరియాను ఆ మండల రైతులకే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయాలని, రైతుల రుణాలను తక్షణమే మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకుడు కలకొండ సురేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, నాయకులు బత్తుల ఉప్పయ్య, నోముల రంగారావు, నిమ్మల వెంకన్న, కలకొండ కల్పన తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి