యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం – రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
రైల్వే పోలీసుల వివరాల ప్రకారం…
ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితమే వివాహమైంది. సింహాచలం హైదరాబాద్లోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా, దంపతులు జగద్గిరిగుట్ట గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు.
విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన అనంతరం కోచ్ డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో ఇద్దరూ అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్మెన్ ఘటనను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కొద్ది రోజులకే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతుల ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి