వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి.. కలెక్టర్ కు వినతి
వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి.. కలెక్టర్ కు వినతి
K.RAVI
చౌటుప్పల్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది మండలాల ప్రజలు వైద్య సేవల కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారి ఉండటంతో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.హైదరాబాద్కు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే స్థోమత లేక అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం రూ.36 కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో సంవత్సరాలు గడుస్తున్నా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాక ప్రజలకు అందుబాటులోకి రాలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అన్ని రకాల వైద్యులను నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, అవ్వారి రామేశ్వరి, చౌటుప్పల్ 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, సప్పిడి శ్రీనివాసరెడ్డి, చికూరు ఈదయ, ముగదాల రాములు, ఎండి జానీ, సోమరాజ్, యాదయ్య, పంతంగి సంధ్య, సుర్వి వెంకటేష్, యాదమ్మ, సుర్వి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి