వికలాంగుల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం పై ఉద్యమం ఉధృతం
వికలాంగుల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం పై ఉద్యమం ఉధృతం
Biksham
ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష – గిద్దె రాజేష్ హెచ్చరిక
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం పై ఉద్యమాన్ని ఉధృతం చేసి గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా వికలాంగుల నెలవారీ పింఛన్ను ఆరు వేల రూపాయలకు, తీవ్రమైన వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, సంబంధిత కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు పూర్తి స్థాయి విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని, అర్హత సాధించిన వారికి వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఈ దీక్షలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై మద్దతు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి