విజె సాయి రసాయన కంపెనీలో అగ్నిప్రమాదం – సీనియర్ కెమిస్ట్ మృతి
విజె సాయి రసాయన కంపెనీలో అగ్నిప్రమాదం – సీనియర్ కెమిస్ట్ మృతి
K.RAVI
పోచంపల్లి మండలందోతిగూడెం గ్రామంలో ఉన్న విజె సాయి రసాయన కంపెనీలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ దార పవన్ (36) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్రోలిన్ రసాయనం ఉన్న డ్రమ్ములో ఎర్తింగ్ లేకుండా డిప్పింగ్ రాడ్తో లెవెల్ పరిశీలిస్తున్న సమయంలో స్పార్క్ ఏర్పడి ఒక్కసారిగా డ్రం పేలింది.దీంతో పక్కనే ఉన్న ఇతర రసాయన డ్రమ్ములకు మంటలు వ్యాపించి యూనిట్ మొత్తం అగ్నికి ఆహుతైంది.మంటల్లో చిక్కుకున్న పవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆర్డీఓ, డిఎస్పీ, డిప్యూటీ తహసిల్దార్ నాగేశ్వరరావు,సిఐ రాములు, ఎస్సై భాస్కర్ రెడ్డి తదితర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.మృతుడు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి భార్య సౌజన్య విలపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు.మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి