విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం
విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం
Biksham Goud
గుర్తుతెలియని వాహనం ఢీతో ప్రాణాలు కోల్పోయిన కోల నరేష్
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మునగాల మండలం తాడ్వాయి గ్రామం (సూర్యాపేట జిల్లా) కు చెందిన కొల నరేష్ (PC–184), తండ్రి రామనరసయ్య, చౌటుప్పల్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధుల నిమిత్తం ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కానిస్టేబుల్ నరేష్ అకాల మరణం పట్ల కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఇది తీరని లోటుగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నరేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి