వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల ఆదేశాలు.
వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల ఆదేశాలు.
Editor Desk
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోండి.
భువనగిరి. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్షించారు.
యాసంగి–2026 సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తీవ్ర ఎండలు, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు సజావుగా సాగడం అభినందనీయమన్నారు.దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.45 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన ధాన్యం నిల్వలను త్వరితగతిన కొనుగోలు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
అకాల వర్షాల ముప్పు దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు పంపేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. తాలు, తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు వరి కోయ్యలకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు భూసారం దెబ్బతింటోందని తెలిపారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కోయ్యలకు నిప్పు పెట్టకుండా చైతన్యం కల్పించాలని సూచించారు.
అనంతరం మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణా రావు తదితరులు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారులు హరికృష్ణ, రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి