వీఆర్వో వింత ప్రవర్తన
వీఆర్వో వింత ప్రవర్తన
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ విఆర్ఓ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ రాసే విద్యార్థులు, అలాగే నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నమోదు చేసుకునే అభ్యర్థులకు ఓబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ప్రజలు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.
అయితే ప్రభుత్వ నిబంధనలను ఆసరాగా చేసుకొని సంబంధిత విఆర్ఓ విద్యార్థులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విఆర్ఓ లాగిన్ ద్వారానే జరిగే “నవశకం అప్లికేషన్” ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, “మీసేవలో చేయించుకోండి” అంటూ విద్యార్థులను పదేపదే తిప్పిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ఇంకా తీవ్ర ఆరోపణ ఏమిటంటే… ఓ మీసేవ నిర్వాహకుడికి విఆర్ఓ లాగిన్ వివరాలు ఇచ్చి, నవశకం అప్లికేషన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన అధికారులే మధ్యవర్తిత్వానికి తావిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఓబీసీ సర్టిఫికెట్ కోసం రోజులు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చదువుల కోసం సమయాన్ని కేటాయించాల్సిన సమయంలో కార్యాలయాల వద్ద అవస్థలు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి