వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక
వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక
GADDAM JAGANMOHAN REDDY
వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం
సకాలంలో సస్యరక్షణ చేపట్టాలి
విస్సన్నపేట :
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సబ్డివిజన్ పరిధిలో వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు, జింకు లోపం లక్షణాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శశికళ, మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్ మాట్లాడుతూ, జింకు లోపం నివారణకు ఎకరానికి ఒక కిలో జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు.
పాము పొడ తెగులు ఉన్న పంటల్లో ఎంట్రకాల్ ఎం-45 (800 గ్రాములు) లేదా కాంటాఫ్ (200 మి.లీ.) లేదా టిల్ట్ (200 మి.లీ.) మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.
అగ్గి తెగులు నియంత్రణకు బీమ్ (120 గ్రాములు) లేదా మెర్జర్ (500 గ్రాములు) మందులను వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు. ఒకేసారి అగ్గి, పాము పొడ తెగుళ్లు ఉన్నట్లయితే కస్టోడియ (40 గ్రాములు) లేదా నాటివో (80 గ్రాములు) మందులను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేయాలని చెప్పారు.
అధిక మోతాదులో నత్రజని ఎరువులు వేయడం వల్ల తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశముందని, సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వాడాలని హెచ్చరించారు. అగ్గి తెగులు సకాలంలో నియంత్రించకపోతే మెడవిరుపు దశకు చేరి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు.
రైతులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి