వలిగొండ–కాటేపల్లి నూతన డబుల్ రోడ్డు ప్రారంభం
వలిగొండ–కాటేపల్లి నూతన డబుల్ రోడ్డు ప్రారంభం
స్థానికం బృందం
రూ.49.50 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
స్థానికం ప్రతినిధి
వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ నుంచి సుంకిశాల మీదుగా కాటేపల్లి వరకు నిర్మించనున్న నూతన డబుల్ రోడ్డు పనులను రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. రూ.49.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసిందని, ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
భువనగిరి–చిట్యాల రహదారిని రూ.180 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
వలిగొండ–కాటేపల్లి రహదారి పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక వసతులు బలోపేతం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన రహదారులు–సమగ్ర అభివృద్ధి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ప్రతి గ్రామ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎన్ఆర్ఐ పైళ్ళ మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి