ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి
ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి
Biksham
ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు ఏఐపీకేఎంఎస్ మద్దతు
ఖమ్మం:
గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు విమర్శించారు. బుధవారం వైరా డివిజన్ అధ్యక్షుడు ఎస్.కే.జానీ అధ్యక్షతన విక్రమ్ భవనంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను ఉద్యమాల భయంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దొడ్డిదారిన నాలుగు కార్మిక కోడులను ప్రవేశపెట్టి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. వికసిత్ భారత్ పేరిట కొత్త పథకాలను తెచ్చి కోట్లాది గ్రామీణ కూలీల పని హక్కును లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదల హక్కు అని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది దళితులు, గిరిజనులు, భూమిలేని కూలీలు ఈ చట్టంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు కార్మిక కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏఐపీకేఎంఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు, కంకణాల పెద వెంకటి, తడికమాల వెంకన్న, సాగి అప్పారావు, ఆవుల భద్రయ్య, సుబ్బారావు, చిన్న వెంకటి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి