తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..
తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..
NM Yadav
పోలీస్ స్టేషన్ల తనిఖీలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు..
నల్గొండ : ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును కూలంకషంగా పరిశీలించారు.
స్టేషన్లోని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, రైటర్ విభాగం, లాకప్ గదులను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరగకూడదని నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్కు వచ్చినప్పుడు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.గ్రామ పోలీసు అధికారులు (GPOs) ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ సూచించారు. అత్యవసర పిలుపులు వచ్చినప్పుడు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకోవాలి. నేరాల అదుపునకు పట్టణ, గ్రామ పరిధిలో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి. పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం..
గంజాయి విక్రయాలు, అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం మళ్లింపు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ తనిఖీ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, తిప్పర్తి ఎస్సై శంకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి