తాతకుంట్ల గ్రామంలో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
తాతకుంట్ల గ్రామంలో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తాతకుంట్లలో ప్రజాశక్తి విద్యా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. మహిళా విద్యకు మార్గదర్శకురాలైన మహాత్మా గాంధీ సహచరుడు జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు స్థాపించి మహిళలకు విద్యను అందించడంలో అపార కృషి చేశారని కొనియాడారు. మహిళల సాధికారతకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాశక్తి విద్యా సంఘం వ్యవస్థాపకురాలు తెరిసా మేడం స్ఫూర్తిదాయకంగా ఎందరికో స్కిల్ ట్రైనింగ్ అందించి మహిళలను తమ కాళ్లపై నిలబడేలా చేసి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో విశేష కృషి చేశారని తెలిపారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని హరినాథ్ విచారం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యను విస్తరించడంలో చేసిన కృషిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమని ఏఐసీసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి. అరుణ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణలో విఫలమయ్యాయని ఆమె విమర్శించారు.
కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రజాశక్తి విద్యా సంస్థ ద్వారా వందలాది మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. భాస్కర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విసన్నపేట, తిరువూరు, గంపలగూడెం, అవనిగడ్డ, ఆత్కూరు, మైలవరం ప్రాంతాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెరిసా మేడం తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు.
ఇందిరా మేడం మాట్లాడుతూ తెరిసా మేడం ఎంతో నిబద్ధతతో పనిచేశారని, ఆమె రాసిన “చింత నిప్పులు” పుస్తకంలో అనేక జీవిత కథలు ఉన్నాయని తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కంప్యూటర్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేసినట్లు హరినాథ్, కృష్ణకుమారి, చంద్రమౌళి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి