తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు
తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు
Biksham
ఏకమై ముందడుగు వేసిన తాళ్లఖమ్మంపహడ్ యువత
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
సూర్యాపేట రూరల్ మండలం: జన్మనిచ్చిన తల్లి, అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడిగా మార్చిన గ్రామం ప్రతి ఒక్కరి జీవితంలో చెరగని గుర్తులుగా నిలుస్తాయి. ఈ భావనతోనే సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహడ్ గ్రామ యువత ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.గ్రామంలోని దేవిరెడ్డి రాంరెడ్డి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో పెయింటింగ్ చేయించి పాఠశాల భవనానికి కొత్త కళను తెచ్చారు. గ్రామానికి చెందిన ఇరవై మంది యువకులు తమ స్వంత ఖర్చులతో తలా కొంత మొత్తం సమకూర్చి తరగతి గదులు, పాఠశాల గోడలకు అందమైన రంగులు వేయించారు.
తరగతి గదుల గోడలపై విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సంబంధిత బొమ్మలు, చిత్రాలు వేయించి పాఠశాల వాతావరణాన్ని ఆకర్షణీయంగా మార్చారు. ఎన్నో సంవత్సరాలుగా రంగులు వేయకపోవడంతో అద్వానంగా మారిన భవనం ఇప్పుడు నూతన రూపంతో మెరిసిపోతోంది. చేతిలో రూపాయి ఉంటే వ్యసనాలకు లోనవుతున్న నేటి యువతకు భిన్నంగా తాళ్లఖమ్మంపహడ్ యువకులు సమాజ సేవలో ఆదర్శంగా నిలిచారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన వారిని గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు కూడా పెయింటింగ్ చేయించి అందంగా తీర్చిదిద్దేందుకు యువత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ అభివృద్ధికి యువత తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ “శభాష్” అని మెచ్చుకుంటున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి