తల్లి సర్పంచ్… కూతురు మేయర్ — ప్రజాసేవలో శక్తివంతమైన మహిళా జంట!
తల్లి సర్పంచ్… కూతురు మేయర్ — ప్రజాసేవలో శక్తివంతమైన మహిళా జంట!
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన బండ సరోజ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై సేవలందిస్తుండగా, ఆమె కూతురు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించనుండటం విశేషంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి–కూతురు ఇద్దరూ ప్రజాసేవలో కీలక పదవుల్లో ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గత డిసెంబరులో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బండ సరోజ ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నిక కావడం ఆమెపై గ్రామస్తుల నమ్మకాన్ని ప్రతిబింబించింది. గ్రామాభివృద్ధి, తాగునీటి సదుపాయాలు, శుచిత్వం, పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఆమె ముందడుగు వేస్తున్నారు.
ఇదే సమయంలో, నల్లగొండ నగర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టడం మహిళా నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, నగర పారిశుధ్యం, స్మార్ట్ పరిపాలన వంటి అంశాలపై ఆమె దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
“మన ఊరి ఆడబిడ్డ మేయర్ కావడం గర్వకారణం” అంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, కూతురు నగరాభివృద్ధికి పునాది వేయబోతుండటం మహిళల సామర్థ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
ఒకే కుటుంబంలో రెండు తరాలు ప్రజాసేవలో సత్తా చాటుతుండటం అరుదైన సంఘటన. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందన్న సందేశాన్ని ఈ తల్లి–కూతురు కథ మరింత బలపరుస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి