సూర్యాపేటలో రహదారి భద్రత వారోత్సవాలు
సూర్యాపేటలో రహదారి భద్రత వారోత్సవాలు
Biksham Goud
ప్రమాదాల నివారణలో విద్యార్థులే దూతలు కావాలి : అదనపు ఎస్పీ
సూర్యాపేట: రహదారి ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరేలా చేయడం లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ ఆలైవ్” రహదారి భద్రత అవగాహన వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక సాయి గౌతమి కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదం సంభవించడం అంటే ఒక కుటుంబం రోడ్డుపాలవడమేనని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు అవగాహన, ముందస్తు జాగ్రత్తలే ప్రధాన మార్గమని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రత విషయంలో విద్యార్థులు దూతలుగా మారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలు, పెద్దలు, నిరక్షరాస్యులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చిన్నపిల్లలు వాహనాలు నడపకూడదని, పెద్దలు తప్పనిసరిగా తలరక్షక కవచం ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రమాదాల నిర్మూలనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, రెండవ పట్టణ ఎస్సై శివతేజ, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి