Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:39 AM

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన
January 17, 2026 08:16 PM 213 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

సంక్రాంతి పండగ ముగించుకుని స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణమైన ప్రజలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండగ సెలవులు ముగియడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడంతో ఎన్‌హెచ్‌పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, కొండమల్లేపల్లి మీదుగా మళ్లించగా, నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను మునుగోడు, నారాయణపూర్ మార్గాల్లోకి మళ్లించారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలకు కోదాడ వయా హుజూర్‌నగర్, మిర్యాలగూడ, చింతపల్లి, మాల్ మార్గాలుగా దారి మళ్లింపు చేపట్టారు. అలాగే చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రోడ్డు వెడల్పు తగ్గి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చిట్యాల వద్ద వాహనాలను రామన్నపేట, వలిగొండ, భువనగిరి మార్గాలుగా మళ్లించారు.

ఈసారి సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో ఏపీకి వాహనాలు వెళ్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఏపీకి తరలివెళ్లినట్లు సమాచారం. తిరుగు ప్రయాణంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీపై అప్రమత్తమైన పోలీసులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News