శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతర విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ సమీక్ష
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతర విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ సమీక్ష
Sthanikam District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12 నుండి 20 వరకు జరగనున్న ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతరను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.జాతర నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించడానికి గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు, ఆయా శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతి శాఖ అధికారి తమ వారి విభాగాల్లో చేపట్టనున్న ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు.కలెక్టర్ మాట్లాడుతూ, జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో, వారికే ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.మహిళా భక్తులకు ప్రత్యేకంగా అధిక సంఖ్యలో శౌచాలయాలు, తాత్కాలిక షవర్లు, స్నానాలకు అవసరమైన మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవస్థానం వరకు చేరే కనెక్టివ్ రోడ్లను మరమ్మత్తులు చేసి, గుంతలను పూరించమని, అవసరమైన చోట సూచనాబోర్డులు ఏర్పాటు చేయమని అధికారులు నిర్దేశించారు.జాతర ఆవరణం మరియు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిరంతరం సక్రమంగా ఉండేలా చూసి, ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని,బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టమని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతర ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అత్యవసర పరిస్థితుల కోసం 108 అంబులెన్స్ వాహనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు.అగ్నిప్రమాదాల నివారణకు దేవస్థానం పరిసరాల్లో అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచమని సంబంధిత అధికారులకు సూచించారు.భద్రతా పరంగా గుడి లోపల, బయట, ఆవరణలో,పార్కింగ్ ప్రాంతాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని,మహిళల స్నాన ప్రాంతాల్లో మహిళా పోలీసులను నియమించాలని ఆదేశించారు.భక్తుల రాకపోకలకు అనుగుణంగా తగిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయమని ఆర్టీసీ అధికారులకు సూచించారు.భక్తుల ఆహ్లాదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించమని విద్యాశాఖ అధికారికి సూచించారు.హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, దివ్యాంగ భక్తుల కోసం వీల్ చైర్స్ అందుబాటులో ఉంచమని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు.దేవస్థానం వద్ద మరోసారి అన్ని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా షిఫ్ట్ వారీగా అధికారుల వివరాలు పొందుపరచాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్డీవోకు ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డీవో లేదా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని దేవస్థానం ఈవోకు సూచించారు.జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాట్లాడుతూ, ప్రతి శాఖ అధికారి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, రోజువారీ పారిశుద్ధ్యం పకడ్బందీగా జరిగేలా చూసి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అదనపు ఎస్పీ రఘునందన్ రావు ఫిబ్రవరి 14 నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని, మహిళల స్నాన ప్రాంతాల్లో మహిళా పోలీసులను నియమించి, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో, డిపిఓ జానకి రెడ్డి, జహీరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి దేవుజా, ఇతర శాఖల అధికారులు, ఝరాసంగం తహసిల్దార్, దేవస్థానం ఈవో శివరుద్రప్ప, చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి