భువనగిరి, సెప్టెంబర్ 18 ఆరోగ్య మిషన్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వర్షపు, వృథా నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించేలా హార్వెస్టింగ్ సోక్పిట్ (ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక హానికర చెత్తగా నాలుగు రకాల చెత్తను వేరు చేసి చెత్త సేకరణ వాహనాల్లో ఎలా వేయాలో అవగాహన కల్పించారు. ఈ విషయాలను విద్యార్థులు తమ ఇళ్లలోని కుటుంబ సభ్యులకు వివరించాలని సర్పంచ్ సూచించారు.
ఫ్రైడే–డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు నీటిని అందించేందుకు రీఛార్జ్ బోర్ పాయింట్ పనులకు కూడా ముగ్గు పోసి ప్రారంభించారు.
తాజ్పూర్ను ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగస్వాములై పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ సంతోష శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్రావు, పాలకవర్గ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి