సరస్వతి దేవి అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు
సరస్వతి దేవి అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఉదయం ఆలయ అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి సరస్వతి దేవి అలంకరణతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రాతఃకాల పూజలు ఘనంగా చేశారు. వసంత పంచమి కావడంతో అమ్మవారి దర్శనం మరింత పుణ్యప్రదంగా భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఆలయానికి పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల నినాదాలు, పూజల మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతంలో మంజీర నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని తెలిపారు. అమ్మవారికి చేసే మొక్కులు ఎంతో ప్రాముఖ్యత కలవని, భక్తుల కోరికలను నెరవేర్చే శక్తి కలిగిన దేవతగా అమ్మవారు ప్రసిద్ధి చెందినారని పేర్కొన్నారు. ప్రత్యేకించి మాఘ అమావాస్య, వసంత పంచమి వంటి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని ఆయన అన్నారు.పండుగ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తంగా వసంత పంచమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలతో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తుల కేరింతలు, నినాదాలతో పులకరించిపోయింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి