సరూర్నగర్ స్టేడియంలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్
సరూర్నగర్ స్టేడియంలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్
స్థానికం బృందం
ఎల్బీనగర్, స్థానికం ప్రతినిధి
సికోకై తెలంగాణ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఆదివారం ఘనంగా జరిగింది. టి. కనకరాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి కరాటే క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రతిభ ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి సినీ నటుడు ఇంద్రసేన, గ్రాండ్ మాస్టర్ జి. విట్టల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ.. కరాటే కేవలం క్రీడ మాత్రమే కాదని, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యంతో పాటు స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. కరాటే సాధనతో విద్యార్థులు ఆరోగ్యంగా, నియమబద్ధంగా ఎదుగుతారని అన్నారు.
ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో బాలికలు, మహిళల భద్రతకు కరాటే ఎంతో అవసరమని పేర్కొన్న ఇంద్రసేన, పిల్లల స్వీయ రక్షణపై తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తగ్గించేందుకు ప్రభుత్వాలు పాఠశాలల్లో కరాటే తరగతులను ప్రవేశపెట్టాలని సూచించారు. కరాటే వ్యక్తిగత రక్షణకే కాకుండా సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగపడాలని, అవసరమైతే ఇతరులను రక్షించే ధైర్యాన్ని కలిగించాలని అన్నారు.
చిన్ననాటి నుంచే కరాటే శిక్షణ పొందితే తమను తాము కాపాడుకోవడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో యోధ టీం చైర్మన్ రాజేశ్వర్, కార్యదర్శి రఘు కుమార్, డాక్టర్ రాము, తీగల శ్రీనివాస్, కిరణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి