స్పాట్’ రెమ్యూనరేషన్ ఎప్పుడిస్తారు?
స్పాట్’ రెమ్యూనరేషన్ ఎప్పుడిస్తారు?
NM Yadav
ఏడాది గడిచినా అందని పదో తరగతి మూల్యాంకన సొమ్ము..
నల్లగొండలో ఉపాధ్యాయ సంఘాల నిరసన ప్రదర్శన..
నల్లగొండ : గతేడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికంతో పాటు కుల గణన విధులకు సంబంధించిన రెమ్యూనరేషన్ను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయ జె.ఎ.సి. సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల స్పాట్ వ్యాల్యూయేషన్ కేంద్రం వద్ద టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. 2025 మార్చిలో జరిగిన పదో తరగతి స్పాట్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికీ పైసా పారితోషికం అందకపోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గత అక్టోబర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో పాలుపంచుకున్న ఉపాధ్యాయులకు కూడా పారితోషికం ఇవ్వడంలో జాప్యం చేయడం తగదని వారన్నారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా పదో తరగతి మూల్యాంకన పారితోషికం రేట్లను పెంచకపోవడం ఉపాధ్యాయులను వంచించడమేనని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే రెండుసార్లు రెమ్యూనరేషన్ పెంచినప్పటికీ, పాఠశాల విద్యలో మాత్రం అదే పాత రేట్లు కొనసాగించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎస్ఎస్సీ స్పాట్ రేట్లను కనీసం 50 శాతం పెంచాలని ప్రస్తుత మూల్యాంకనం పూర్తయ్యే రోజే ఉపాధ్యాయుల ఖాతాల్లో నగదు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ వినతులతో కూడిన పత్రాన్ని క్యాంపు అధికారికి అందజేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలం నారాయణరెడ్డి, పెరుమాళ్ళ వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, అరుణ, భాను ప్రకాష్, నలపరాజు వెంకన్న, బోస్కా సైదులు రావ్ జనార్ధన్ తదితర జిల్లా, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి