సమాన విద్య అందించడంలో అంబేద్కర్ యూనివర్శిటీ ముందుంది న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్
సమాన విద్య అందించడంలో అంబేద్కర్ యూనివర్శిటీ ముందుంది న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్
Editor Desk
హైదరాబాద్, న్యూస్టుడే:
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని వర్గాలకు సమాన విద్యా అవకాశాలు కల్పించడంలో విశేష కృషి చేస్తోందని న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేశన్ కన్నాభిరాన్ ప్రశంసించారు.
విద్యా వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అంతర్గత నాణ్యత హామీ విభాగం (IQAC), జాతీయ అధ్యయన గుర్తింపు మండలి (NAAC), కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) సంయుక్త ఆధ్వర్యంలో “న్యాక్తో విద్యాపరమైన సంభాషణ” అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి వర్క్షాప్ ఏర్పాట్లను ప్రొ. గణేశన్ కన్నాభిరాన్ సమీక్షించారు. నాణ్యతా హామీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే వర్క్షాప్ లక్ష్యమని తెలిపారు.
అనంతరం విశ్వవిద్యాలయ డీన్లు, డైరెక్టర్లతో సమావేశమై శాఖల ప్రామాణిక కార్యాచరణ విధానాలపై చర్చించారు. సమ్మిళిత విద్యకు అంబేద్కర్ యూనివర్శిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా నాణ్యత పెంపు కోసం పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థులు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు ఉచిత విద్య అందించడంతో పాటు కార్పొరేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. విజయకృష్ణారెడ్డి, ప్రొ. పల్లవి కబ్డే, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. రజనీ, ప్రొ. చంద్రకళ, ప్రొ. రాణి రజిత మాధురి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి