సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్కు భూమి పూజ
సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్కు భూమి పూజ
Biksham
ఐదు కోట్లతో సుందరీకరణ – పర్యాటక కేంద్రంగా సూర్యాపేట అభివృద్ధి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు బుధవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూర్యాపేటను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ట్యాంక్ బండ్కు సంబంధించిన పనులు పూర్తిగా నిలిచిపోయాయని, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఐదు కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులను ఆరు నెలల లోపు పూర్తిచేసి, సూర్యాపేట ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా భోజనశాల, నడక మార్గం, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా ఒక కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎనభై సీట్ల ఎయిర్ కండిషన్ బోట్కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ బోట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఒక నెలలోపు పూర్తిచేసి ప్రారంభోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఈ బోట్ను పుట్టినరోజు వేడుకలు, చిన్న కార్యక్రమాలు, చెరువు మధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అదేవిధంగా, సద్దుల చెరువు పరిసర ప్రాంతంలోని సుమారు ఐదు ఎకరాల పార్క్ స్థలంలో పదిహేను కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని, అవసరమైతే మరో పది కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి అయినా ఈ పార్క్ను ట్యాంక్ బండ్, ఐలాండ్ పార్క్ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.పిల్లలతో కుటుంబ సమేతంగా వచ్చే వారికి వినోదంగా గడిపేలా ఆట స్థలం, చిన్న నాటకశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అన్ని అభివృద్ధి పనుల ద్వారా సూర్యాపేటను పర్యాటక రంగంలో ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.సూర్యాపేట పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి