రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజల ఘన మద్దతు
రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజల ఘన మద్దతు
Biksham
సూర్యాపేట పురపాలక సంస్థలో అఖండ విజయం – విజయోత్సవ ర్యాలీ ఘనంగా
సూర్యాపేట పురపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి పురపాలక సంస్థను కాంగ్రెస్కు హస్తగతం చేశారని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలిన బిఆర్ఎస్కు పట్టణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య గారు, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ సంఘం సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అంజద్ అలి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారని తెలిపారు.
పురపాలక సంస్థలో 31 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో చైర్పర్సన్గా మొరిశెట్టి నివేదిత లక్షాది ని, ఉపాధ్యక్షునిగా మహమ్మద్ షఫీ ఉల్లా ని ఎన్నుకుంది. సోమవారం స్థానిక పురపాలక కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున ప్రజలు జననీరాజనాలు పలుకుతూ నాయకులను స్వాగతించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల పాలనలో సూర్యాపేట జిల్లా కేంద్రం వెనుకబడిపోయిందని, ఇకపై పురపాలక సంస్థను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతామని తెలిపారు. ప్రజాసేవకు కట్టుబడి ఉన్న వారికే పార్టీ అవకాశాలు కల్పించామని, అదే తమ విజయానికి కారణమైందన్నారు.పురపాలక సభా నాయకుడిగా కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ని అధిష్టానం అనుమతితో ఖరారు చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ప్రకటించారు.ఈ విజయం దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి అంకితం చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి