రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు
రైతు ముంగిట శాస్త్రవేత్తల సూచనలు
K.RAVI
సన్నరకాల వరి సాగుతో అధిక లాభాలు.. నానో యూరియా వినియోగంపై అవగాహన
చౌటుప్పల్ మండలంలోని రైతు వేదికలో బుధవారం “రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రభావతి పాల్గొని వచ్చే వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వరిలో బీపీటీ –5204,ఆర్ఎన్ఆర్ –15048,కెఎన్ఎమ్–1638, డబ్ల్యుజిఎల్ –44 (సిద్ధి),హెచ్ ఎం టి సోనా, జైశ్రీరామ్ వంటి సన్నధాన్య రకాలను సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు ప్రభుత్వం అందించే క్వింటాకు రూ.500 బోనస్ పొందవచ్చన్నారు. అలాగే ఎం టి యు –1010, కె ఎన్ ఎం –118 వంటి దొడ్డు రకాల సాగుతో గ్రేడ్–ఏ మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వాడాలని, ఎకరాకు రెండు బస్తాలకు మించి యూరియా వేయొద్దని సూచించారు.వరి పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు నాట్లు వేసే వారం రోజుల ముందు ఒక సెంట్ నారుమడికి 2 కిలోల కార్బోఫ్యూరాన్ 4జి గుళికలు వేయాలని తెలిపారు. అలాగే నాటు వేసిన 15 రోజులకు ఒకసారి పురుగుమందు పిచికారీ చేస్తే మొగి పురుగు నివారణ సాధ్యమవుతుందన్నారు. దోమపోటు నివారణకు కాళిబాటలు తప్పనిసరిగా తీయాలని సూచించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు విత్తనాలు, ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధ్యమవుతాయన్నారు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్ చైర్మన్ చేన్నాగోని అంజయ్య శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పొల్లేపల్లి లక్ష్మీ,రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకట్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి