రైతు పండించిన చివరి గింజ వరకు కొంటాం..
రైతు పండించిన చివరి గింజ వరకు కొంటాం..
NM Yadav
పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి కావాలి..
ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, లక్ష్మణ్ కుమార్..
క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించండి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
నల్గొండ : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం సేకరణపై మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలోనే ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
రూ. 22 వేల కోట్లతో కొనుగోళ్లు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక గణాంకాలను వెల్లడించారు.. దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాల ద్వారా సేకరణ సాగుతోంది. ఇప్పటివరకు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రైతుల ఖాతాల్లో రూ. 4,800 కోట్లు జమ చేశాం.. ధాన్యం రవాణా కోసం 11,500 వాహనాలను వినియోగిస్తున్నాం. వచ్చే 10 రోజుల్లో లారీలు, డీసీఎంలను కేవలం ధాన్యానికే వాడి ప్రక్రియను పూర్తి చేయాలి. అన్లోడింగ్లో ఇబ్బంది పెట్టే వాహనాలను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.
మిల్లర్లు సహకరించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి..
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 67 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. ధాన్యం ఒకేసారి మార్కెట్కు రావడం, గాలిదుమారాల ముప్పు ఉన్న నేపథ్యంలో మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. గోదాముల్లో స్థలభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ధాన్యం దించుకోవడంలో వేగం పెంచాలని సూచించారు.
25వ తేదీలోగా ముగియాలి కోమటిరెడ్డి..
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీలోగా అన్ని కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తి కావాలని గడువు విధించారు. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారిని పర్యవేక్షణకు ఉంచాలన్నారు. "రైతన్నకు సేవ చేసేందుకు అధికారులు అదనంగా రెండు గంటలైనా పని చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రవాణా సమస్యల పరిష్కారానికి అసోసియేషన్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు బి.చంద్రశేఖర్, అనురాగ్ జయంతి, తేజస్ నందులాల్ పవార్లు వారి జిల్లాల్లోని కొనుగోలు పురోగతిని వివరించారు. తడిచిన ధాన్యాన్ని కూడా సేకరించి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, సామేలు, అనిల్ కుమార్ రెడ్డి, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, సత్యం, శంకర్ నాయక్ మరియు మూడు జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి