రామన్నపేట కోర్టులో బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక సదస్సు
రామన్నపేట కోర్టులో బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక సదస్సు
స్థానికం బృందం
‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ లక్ష్యంగా ప్రతిజ్ఞలు, సంతకాల ప్రచారం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, జిల్లా న్యాయ సహాయ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తాజా సర్వేల్లో వెల్లడైందని, వాటిని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల బాలికలు, బాలులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడులు ఎదురవుతున్నాయని వివరించారు. బాల్య వివాహాలు నిర్వహించినవారికి, చేసుకున్నవారికి, సహకరించిన వారికి చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
సదస్సులో పాల్గొన్న న్యాయవాదులు, అధికారులు, ప్రజలు బాల్య వివాహాలు జరగకుండా తమ వంతు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కుటుంబాల్లో, పరిసర ప్రాంతాల్లో లేదా సమాజంలో బాల్య వివాహ ప్రయత్నాలు జరిగితే వెంటనే పంచాయితీ లేదా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందిస్తామని ముక్తకంఠంతో ప్రకటించారు. అనంతరం పోస్టర్ ఫోటో గ్యాలరీలో ఫోటోలు తీసి, సంతకాల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మస్జిద్, సీనియర్ న్యాయవాదులు, న్యాయ సేవల సిబ్బంది, చైల్డ్ హెల్ప్లైన్ జిల్లా సమన్వయకర్త దశరథ్, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, కోర్టు మరియు పోలీసు సిబ్బంది, కోర్టుకు హాజరైన ప్రజలు, లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, కోక సబిత, కానుగంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి