ఫొటోలకు ఫోజులే.. అభివృద్ధి శూన్యం ఎమ్మెల్యే ఐలయ్యపై గొంగిడి సునీత
ఫొటోలకు ఫోజులే.. అభివృద్ధి శూన్యం ఎమ్మెల్యే ఐలయ్యపై గొంగిడి సునీత
Editor Desk
రాజాపేట:
ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఫొటోలకు ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు.
గురువారం రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే, వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో కూడా లేకుండా పోయారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం 15వ ప్యాకేజీ కింద కాల్వల పనులను సగం వరకు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదని మండిపడ్డారు.
సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలరోజులు గడిచినా కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యే అధికారులతో సమీక్షలు నిర్వహించకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. రైతుల పాలిట ఈ ప్రభుత్వం శాపంగా మారిందని విమర్శించారు.
రాష్ట్రంలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, మూడు విడతల నిధులను విడుదల చేయకుండా ఎగ్గొట్టిందని ఆరోపించారు. రైతులు ఎరువుల కోసం రాత్రింబవళ్లు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, పీఏసీఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్రెడ్డి, సంధిళ్ల భాస్కర్ గౌడ్, గుంటి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి