పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చందన బ్రదర్స్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వైటీ భీమరాజు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు కె.అజయ్బాబు, రాష్ట్ర సమితి సభ్యుడు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల భారం మరింత పెరిగిందన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు.
పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, చమురుపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి.ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్, దేవా, నరసింహులు, వీరేష్తో పాటు హమాలి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి