పెనుకొండలో అభివృద్ధి జోరు – రూ.40 లక్షల పనులకు భూమిపూజ, పూల మార్కెట్ ప్రారంభం
పెనుకొండలో అభివృద్ధి జోరు – రూ.40 లక్షల పనులకు భూమిపూజ, పూల మార్కెట్ ప్రారంభం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా రూ.40 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఘనగిరి పూల మార్కెట్ను ఆమె ప్రారంభించారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు రూ.6 లక్షల వ్యయంతో పూల మార్కెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు రూ.50 లక్షలతో శానిటేషన్ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. త్వరలోనే రూ.5 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మడకసిర రోడ్ వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, పెనుకొండ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేస్తూ, ఆయన తరచూ మాట మార్చే వ్యక్తి అని ఆరోపించారు. పార్టీ ఉనికికోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి విషయంలో అన్ని పార్టీలూ మద్దతు పలికినా, వైసీపీ మాత్రం వెనుకంజ వేసిందని పేర్కొన్నారు. అమరావతి రైతులు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి