పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. జూన్ 18న ‘చలో హైదరాబాద్’కు పిలుపు
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. జూన్ 18న ‘చలో హైదరాబాద్’కు పిలుపు
Editor Desk
నల్గొండ,: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నాయకులు డిమాండ్ చేశారు. జూన్ 18న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నల్గొండలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలోని డ్రెయినేజీ పనుల నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు చేపడుతున్న కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి సిఫార్సులు, ప్రభావాలు లేకుండా సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులు విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుంటున్నప్పటికీ, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఆలస్యం చేయడం వల్ల కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు, సరఫరాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
అత్యవసర, ప్రాధాన్య పనులను కొనసాగిస్తూ, ప్రస్తుతం అమలు చేయడం సాధ్యం కాని పనులను తాత్కాలికంగా నిలిపివేసి వాటికి సంబంధించిన డిపాజిట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్లు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములేనని, నిర్మాణ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పారదర్శకంగా బిల్లులు చెల్లించాలని కోరారు.
సమావేశంలో బీఏఐ ఆల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఎస్.ఎస్.రెడ్డి, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.వి.ఎన్.రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్.శ్రీనివాసరావు, రాష్ట్ర ఖజాంచి జి.సంతోష్రెడ్డి, నల్గొండ సెంటర్ చైర్మన్ వి.శ్రీనివాస్రెడ్డి, మాజీ చైర్మన్ ఎస్.కృష్ణారావుతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి