చాట్రాయి: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను రూ.60 వరకు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలు పెంచుతున్నా కూటమి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.
చిత్తపూరు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని త్వరలో కలవనున్నట్లు చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, కొత్తపల్లి ప్రసాద్, సోమేశ్వరరావు, పుల్లారావు, నారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి