ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్
ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన – 50 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ హార్ట్ స్ట్రోక్తో మృతి చెందాడు. అయితే, చివరి క్షణాల వరకూ తన ప్రాణాల కంటే బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచాడు.
బస్సు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో డ్రైవర్కు ఛాతిలో నొప్పి ప్రారంభమైంది. సాధారణ నొప్పి అని భావించిన ఆయన బస్సును చౌటుప్పల్ వరకు నడిపించాడు. నొప్పి తీవ్రత పెరగడంతో హార్ట్ స్ట్రోక్గా గుర్తించాడు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సును వెనక్కి తీసుకెళ్లే సాహసం చేయలేదు.
చౌటుప్పల్ వద్ద బస్సును సురక్షితంగా నిలిపివేసి, సమీపంలోని ఆస్పత్రికి వెళ్లిన వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని విజయవాడకు చెందిన నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
డ్రైవర్ అత్యవసర పరిస్థితిలో బస్సును అధిక వేగంతో నడిపి ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని ప్రయాణికులు పేర్కొన్నారు. తన ప్రాణాలు కోల్పోయినా, 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన నాగరాజు త్యాగం ప్రశంసనీయం అని స్థానికులు, ప్రయాణికులు భావవ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి