ప్రతి గర్భిణికి సమయానుకూల పరీక్షలు – ఆరోగ్యకరమైన భవిష్యత్తు
ప్రతి గర్భిణికి సమయానుకూల పరీక్షలు – ఆరోగ్యకరమైన భవిష్యత్తు
Krishna
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో “సేఫ్ మదర్ డే” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య సేవలు, ఏఎన్సీ పరీక్షల ప్రాముఖ్యత, మాతృ మరణాల తగ్గింపు, సిజేరియన్ ప్రసవాలు, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పీసీపీఎన్డీటీ చట్టంపై డాక్టర్లకు వర్క్షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. తల్లి–బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలను అందిస్తున్నదని, గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తుందని, చిన్న వయసులో గర్భధారణ వల్ల సమస్యలు తలెత్తే అవకాశమున్నందున మైనర్ బాలికల వివాహాలను అరికట్టడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షిత ప్రసవాలు, తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమని తెలిపారు. గర్భధారణ సమయంలో సమయానికి పరీక్షలు, టీకాలు, సరైన పోషకాహారం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. సమగ్ర ప్రణాళికతో పనిచేసి మాతృ మరణాల రేటును పూర్తిగా తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. కొత్తగా తల్లులైన మహిళలకు అవసరమైన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని, ఆశా, ఏఎన్ఎంల ద్వారా గ్రామ స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించి గర్భిణీలకు పూర్తి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే పీసీపీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.కార్యక్రమంలో మాతా–శిశు ఆరోగ్య పరిరక్షణ, సురక్షిత ప్రసవాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి సేఫ్ మదర్ హుడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వసంత్ రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. మురళీకృష్ణ, డీసీహెచ్ఎస్ డా. కవిత, ప్రోగ్రాం అధికారులు, వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, గర్భిణీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి