ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు
స్థానికం బృందం
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న జరిగే పోలింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. పోలింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను, భోజన వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సిబ్బందికి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. లైటింగ్, త్రాగునీరు, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని, పోలింగ్ సిబ్బందిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్ వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు సరిగా ఉన్నాయా లేవా అని ముందుగా పరిశీలించి మాత్రమే సిబ్బందికి అప్పగించాలని తెలిపారు.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది కూడా తమకు కేటాయించిన సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోనే పూర్తిగా పరిశీలించి జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సిందిగా తెలిపారు. ఈరోజు రాత్రికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓటర్లు కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న పోలింగ్ తీరును నిశితంగా పరిశీలించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి