ప్రాణం తీయకండి.. బాధ్యతగా వాహనం నడవండి!
ప్రాణం తీయకండి.. బాధ్యతగా వాహనం నడవండి!
NM Yadav
నిర్లక్ష్యపు డ్రైవింగ్పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్.. లారీ డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు
నల్లగొండ : రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు వహించే చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో భారీ వాహనాల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, అలసట వల్లనే సంభవిస్తున్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా భారీ వాహనాల వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అందుకే డ్రైవర్లు 'డిఫెన్సివ్ డ్రైవింగ్' అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎదుటి వాహనదారులు చేసే పొరపాట్లను కూడా ముందుగానే అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరించడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ వైపు నుండి ఓవర్టేక్ చేయకూడదని ఎస్పీ ఆదేశించారు. వాహనం ఏవైనా సాంకేతిక సమస్యల వల్ల రోడ్డుపై నిలిచిపోయినప్పుడు ఇతర వాహనదారులకు ప్రమాదం కలగకుండా తప్పనిసరిగా రిఫ్లెక్టర్ స్టిక్కర్లు, ట్రాఫిక్ కోన్స్ మరియు ఇండికేటర్లను ఉపయోగించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారి టోల్ ఫ్రీ నంబర్ 1033 కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. డ్రైవర్లు నిరంతరాయంగా వాహనం నడపకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని ప్రయాణం ప్రారంభించే ముందే బ్రేకులు, టైర్లు మరియు లైట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను అనుమతిస్తామని నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం లేదా అనధికారిక పార్కింగ్ వంటి కేసుల్లో లైసెన్సుల రద్దుతో పాటు వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు, రోడ్డు ప్రమాద బాధితులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే వారికి 'రహవీర్ పథకం' కింద రూ. 25 వేల నుండి రూ. లక్ష వరకు ప్రోత్సాహక నగదు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, లారీ అసోసియేషన్ ప్రతినిధులు చాంద్ పాషా, రవీందర్ రావు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి