ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు పకడ్బందీగా: కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు పకడ్బందీగా: కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
శనివారం నల్గొండలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు రాబోయే ధాన్యం కొనుగోలు సీజన్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లకు అవగాహన సదస్సులు నిర్వహించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి